ఏటూరునాగారం, జనవరి 1: ములుగు జిల్లా ఏటూరునాగారంలో నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రజా చైతన్య సదస్సు ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా నరేశ్ హాజరయ్యారు. గతంలో ఆయన అయ్యప్ప స్వామిని, భక్తులను కించపర్చేలా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బైరి నరేశ్ వచ్చిన విషయం తెలుసుకున్న అయ్యప్ప మాలధారులు ఫంక్షన్ హాల్కు చేరుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం తలెత్తి ఉద్రిక్తతకు దారి తీసింది. గతంలో తనపై ఇదే విషయమై కేసులు నమోదయ్యాయని, తాను అన్న మాటలను వెనక్కి తీసుకున్నానని, తనను క్షమించాలని నరేశ్ కోరారు. అనంతరం వెనుదిరిగి వెళ్తుండగా అయ్యప్ప భక్తుడు పోగు నర్సింహారావు కాలు మీది నుంచి నరేశ్ కారు టైరు వెళ్లింది.
అయినా కారు ఆపకుండా వెళ్లడంతో కోపోద్రిక్తులైన భక్తులు కొందరు నరేశ్ను అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మరికొందరు వెంబడించారు. కమలాపురం వైపు వెళ్తున్న బైరి నరేశ్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డు కింద చెట్లల్లోకి దూసుకెళ్లింది. కారు ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో నరేశ్తోపాటు అందులో ఉన్నవారికి ప్రమాదం తప్పింది. అనంతరం కారు దిగి పారిపోయారు. సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును పోలీస్స్టేషన్కు తరలించారు. గాయపడిన నర్సింగరావును మొదట ఏటూరునాగారం మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించారు.