హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థుల కోసం ఆయుష్ విభాగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వార్షిక పరీక్షలు రాసే పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. పరీక్షల వేళ విద్యార్థుల మేధోశక్తిని, పఠన సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక కిట్ను రూపొందించింది. ఇందులో ఆయుర్వేద, యునాని, హోమియోపతి మందులు కలిపి ఉన్నాయి. ఈ కిట్లను తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 400 పాఠశాలలో పంపిణీ చేస్తున్నారు. సత్ఫలితాలు వస్తే వచ్చే సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. నెలకు సరిపడ మందులను విద్యార్థులకు అందజేస్తున్నారు. పరీక్షల వేళ ఒత్తిడికి గురి కాకుండా ఎలా ఉండాలో, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సూర్య నమస్కారాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. కిట్తోపాటు విద్యార్థులకు రాగిలడ్డూ కూడా అందిస్తున్నారు.
1) బ్రహ్మీ గ్రాన్యూల్స్ (ఆయుర్వేదం)
2) మజున్-ఇ-ఫల్సఫా (యునాని)
3) ఆల్ఫా ఆల్ఫా సిరప్ (హోమియోపతి)
4) ఫెర్రమ్ ఫోస్ 6ఎక్స్ ట్యాబ్లెట్లు(హోమియోపతి)
ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వంటివి మన పురాతన వైద్య విధానాలు. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా, మరింత సమర్థంగా పరీక్షలు రాసేలా ఈ కిట్ను అందిస్తున్నాం. వారి మేధోశక్తిని పెంచేందుకు ఇది సాయం చేస్తుంది.
– ఆయుష్ విభాగం డైరెక్టర్, ప్రశాంతి