అసమాన ప్రతిభతో పంచవన్నెల చిలుకలాంటి రంగురంగుల వస్ర్తాలను సృష్టించే నేతన్న బతుకుకు గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం కొత్త కాంతులు అద్దుతున్నది. చేతినిండా పని, గుండెల నిండా ధైర్యం ఇస్తూ వేలమంది కార్మికులకు భరోసా ఇస్తున్నది. రాత్రీపగలూ శ్రమించి నేత పరిశ్రమకు గతవైభవం తెచ్చింది. దీంతో చేనేతల బతుకులు ఇప్పుడిప్పుడే చిక్కబడుతున్నాయి. ఇంతలోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు పన్నుపోటుతో వారి వెన్ను విరిచే దుర్మార్గానికి పూనుకున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేత కార్మికుల నోట్లో మట్టికొట్టే చర్యలు చేపడుతుంటే, తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిత్యం శ్రమిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన భయానక పరిస్థితులు మళ్లీ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. చేనేత మిత్ర, నేతన్నలకు చేయూత, పావలా వడ్డీ తదితర పథకాలతో నేత కార్మికులకు కొండంత భరోసా ఇస్తున్నది. దీంతో దశాబ్దాలపాటు కూటికి ఏడ్చిన నేతన్నల జీవితాలు ఇప్పుడిప్పుడే చిక్కబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం వస్త్రపరిశ్రమపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచటంతో నేత కార్మికుల బతుకులు మరోసారి ప్రమాదంలో పడబోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
వస్త్రపరిశ్రమపై జీఎస్టీని పెంచాలన్న కేంద్రప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ ప్రతిపాదన రాగానే తీవ్ర అభ్యంతరం తెలిపింది. పన్ను పెంచితే వస్త్రపరిశ్రమనే నమ్ముకొని చాలీచాలని ఆదాయాలతో బతుకీడుస్తున్న 90 లక్షల మంది కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని గట్టిగా కొట్లాడింది. బీజేపీ పాలిత రాష్ర్టాలన్నీ ఆ పార్టీ అధిష్ఠానానికి సాగిలబడి కేంద్రం చెప్పినట్టల్లా తలాడించటంతో ఇప్పుడు నేత కార్మికులపై పిడుగు పడబోతున్నది. 2014 లో అధికారంలోకి వచ్చినప్పటినుంచే వస్త్ర పరిశ్రమ ఆయువుపట్లను బీజేపీ ప్రభుత్వం తెగనరుకుతూ వచ్చింది. ఇప్పుడు పరిశ్రమ మనుగడకే ఎసరు తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జీఎస్టీ 12 శాతానికి పెంచటంతో దేశంలో వస్త్రపరిశ్రమ, ముఖ్యంగా చేనేత రంగం మనుగడ కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఖాదీలాగే చేనేతలు కూడా వస్ర్తాలు నేస్తుంటారు. కేంద్రం మాత్రం ఖాదీకి అనేక రాయితీలిస్తూ చేనేతలపై తీవ్ర వివక్ష చూపుతున్నది. దశాబ్దాలుగా ఈ పరిశ్రమ సంక్షేమాన్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోకపోవటంతో ఏటేటా నేత కార్మికుల సంఖ్య పడిపోతున్నది. దేశవ్యాప్తంగా 1970లో 124 లక్షల చేనేత కుటుంబాలుండగా, 1995 నాటికి 64 లక్షలు, 2011 నాటికి 43.30 లక్షల కుటుంబాలే మిగిలాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ వృత్తి మరింత నిరాదరణకు గురవటంతో ప్రస్తుతం దేశంలో చేనేత కుటుంబాలు 30.44 లక్షలు మాత్రమే మిగిలాయని తాజా సర్వేలు తేల్చాయి. పన్ను పెంపు ఇంకా అమల్లోకి రాకుండానే నేతపరిశ్రమలో వాడే అన్నిరకాల ముడిపదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. కాటన్, సిల్క్ ధరలు 30-40 శాతం పెరిగాయి. నిర్వహణ మూలధనం కూడా ఇప్పుడు భారీగా అవసరమవుతున్నది. ఇదంతా కలిసి వస్ర్తాల ధరలను పెంచుతాయి. దీంతో వస్ర్తాలకు డిమాండ్ పడిపోతుంది. బట్టలు అమ్ముడుపోని పరిస్థితుల్లో ఉత్పత్తిని తగ్గిస్తారు. దానివల్ల కార్మికులకు పని దొరకటం కష్టమవుతుంది. అనివార్యంగా నేతకార్మికులంతా వృత్తిని వదిలి కూలీలుగా మారే పరిస్థితులు ఏర్పడుతాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. ముఖ్యంగా నేత పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. కేంద్రం ఒక్కపైసా ఇవ్వకున్నా సొంత నిధులతోనే చేనేతను పండుగలా మారుస్తున్నది. రాష్ట్రంలో 19,055 మంది చేనేత కార్మికులు, 38,110 మంది అనుబంధ కార్మికులు ఉన్నారు. వీరందరికీ ఉపాధి కల్పించేలా కొత్త పథకాలను ప్రారంభిస్తున్నది. బతుకమ్మ చీరల పథకంతో కార్మికులకు చేతినిండా పని కల్పించింది.