హుజూరాబాద్ : తరతరాలుగా వెనుకబడి, వివక్షకు గురైన దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని 11వ వార్డులో దళిత బంధు పథకం అవగాహన సదస్సులో మంత్రి కొప్పుల పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఊరిలో చాలా పేదవారు ఎవరైనా ఉన్నారంటే వారు దళితులేనని ప్రభుత్వ పరిశీలనలో తేలిందన్నారు. గత ప్రభుత్వాలు దళితుల కోసం చేసిందేమీ లేదు. కంటితుడుపు చర్యగా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు కానీ అవి అమలుకు నోచుకోలేదు. నేడు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
బీసీ వర్గాలకు కూడా సీఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తున్నారు. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు చేపల పంపిణీ చేస్తున్నారు. కులవృత్తులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దళిత బంధు పథకంతో దళితులు తప్పకుండా అభివృద్ధి చెందుతారు. వారి జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందన్నారు. కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. తాగు, సాగునీటి సమస్య లేనే లేదన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.