హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : నిర్మాణ రంగంతోనే 23 శాతం వాయు కాలుష్యం, 50 శాతం వాతావరణ మార్పు, 40 శాతం తాగునీటి కాలుష్యం, 50 శాతం వ్యర్థాలు పోగవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీపై సదస్సులో పలువురు నిపుణులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) స్టేట్ ఎక్స్పర్ట్ ఆప్రైజల్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 20 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ బిల్డప్ ఏరియా నిర్మాణ ప్రాజెక్ట్లకు పర్యావరణ క్లియరెన్స్ అవసరమన్నారు. దేశంలోని మొత్తం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో నిర్మాణ రంగం సుమారు 8 శాతం వాటా ఉండగా.. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు దాదాపు 39 శాతం నిర్మాణరంగం నుంచే వస్తున్నాయి. మన దేశంలో నిర్మాణ పరిశ్రమ 2025 నాటికి రూ.115 లక్షల కోట్లకు చేరుతుందని, రియల్ ఎస్టేట్ డిమాండ్ ప్రధాన నగరాల్లో 15 -18 మిలియన్ చదరపు అడుగులకు పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య తీవ్రతలను తగ్గించేందుకు కృషిచేయాలన్నారు.