హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రైతులు పంటలను ఆరబెట్టుకోవడానికి కల్లాల నిర్మాణంపై అధికారులు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.779 కోట్లతో 97,710 కల్లాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ మేరకు రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నది. ఇప్పటివరకు 7,089 కల్లాల నిర్మాణం పూర్తికాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వీటికోసం ప్రభుత్వం రూ.41.73 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో లక్షల ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందుతున్నది. దీంతో సాగువిస్తీర్ణం పెరిగి పంటను ఎండబెట్టడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకు పరిష్కారంగా కల్లాలను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వమే రైతు కల్లాలకు 90% నిధు లు భరిస్తుంది. ఈ పనులకు అవసరమయ్యే సిమెంట్ను కూడా తక్కువ ధరకు సరఫరా చేసేవిధంగా చూడాలని అధికారులకు ఆదేశాలి చ్చింది.
ప్రభుత్వం 538 చదరపు మీటర్లలో కల్లానికి రూ.56 వేలు, 645 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 807 చదరపు మీటర్లకు రూ.85 వేలు వెచ్చిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు పదిశాతం యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తం అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 1537 రైతు కల్లాలు, కామారెడ్డి జిల్లాలో 1129, నిజామాబాద్లో 630, ఖమ్మంలో 391, వికారాబాద్లో 273 నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే, ఒకసారి కల్లం నిర్మిస్తే ఆ భూమి పంట సాగుకు శాశ్వతంగా పనికి రాదనే ఉద్దేశంతో రైతులు ముందుకు రావడంలేదు. దీంతో రైతు కల్లాల నిర్మాణం మందకొడిగా సాగుతున్నదని గుర్తించిన ప్రభు త్వం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో వీటి నిర్మాణాలను మరింత పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.