Minister Sabitha Indra Reddy | మాక్ ఎంసెట్ విద్యార్థులకు పరీక్షలపై అవగాహన ఏర్పడుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రముఖ ఆన్లైన్ అసెస్మెంట్ ప్లాట్ఫామ్ సంస్థ ఎక్స్ప్లోర్ (Xplore.co.in ), కీసర గీతాంజలి కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాక్ ఎంసెట్ టెస్ట్కు సంబంధించిన పోస్టర్ను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాక్ టెస్ట్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు.
విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి పరీక్షలు రాయాలని సూచించారు. సంస్థ డైరెక్టర్ అఖిల్ మోదే మాట్లాడుతూ ఈ సిరీస్లోని నాలుగు మాక్ టెస్టులను ఎంసెట్కు హాజరుకానున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు కోసం ప్రాక్టీస్ కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు. పరీక్ష రాసిన వారికి వారి ఫలితాలు వెంటనే తెలుపనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా మెయిన్ పరీక్షలకు విద్యార్థులు మరింత మెరుగైన కృషి చేయవచ్చునని తెలిపారు.
సంస్థ డైరెక్టర్ తాడేపల్లి సునీల్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే తయారుచేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు tseamcet.xplore.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తొలి మాక్ టెస్ట్ ఏప్రిల్ 5న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు tseamcet.xplore.co.inలో అందుబాటులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మాక్ టెస్టులు ఏప్రిల్ 15, 25, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎక్స్ప్లోర్ మార్కెటింగ్ హెడ్ ప్రణీత్ నల్లి పాల్గొన్నారు.