దుండిగల్, డిసెంబర్ 6: మంచి మార్గదర్శనంతో విద్యార్థుల విదేశీవిద్య కల సులువుగా నెరవేర్చుకోవచ్చని వై-యాక్సిస్ కన్సల్టెన్సీ సంస్థ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ పేర్కొన్నారు. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మంగళవారం నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలపై వై-యాక్సిస్ సంస్థ విద్యార్థులకు అవగాహన కల్పించింది.
ఈ సందర్భంగా ఫైజల్ హుస్సేన్ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నతవిద్యను పూర్తిచేసి, అక్కడే స్థిరపడాలనుకొనే విద్యార్థులకు తమ సంస్థ చక్కని గైడెన్స్ అందజేస్తున్నదని చెప్పారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లిష్లో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులకు విదేశాల్లో పుష్కలమైన విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బీటెక్ పూర్తిచేసిన విద్యార్థుల్లో 90 శాతానికి పైగా ఉన్నత విద్యను విదేశాల్లో చదివేందుకు ఉత్సుకత చూపుతున్నప్పటికీ.. సరైన గైడెన్స్ లేని కారణంగా చాలామంది విదేశీ విద్యకు దూరం అవుతున్నారని వివరించారు.
ప్రధానంగా యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లాలనుకొనే విద్యార్థులకు ప్రవేశం, వీసా వంటి ప్రక్రియకు కనీసం 7 నుంచి 14 నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఆలస్యంగా మొదలుపెడితే విద్యాసంవత్సరం నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. బీటెక్ మూడో సంవత్సరంలోనే ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే విద్యార్థులు వై-యాక్సిస్ సంస్థను సంప్రదిస్తే వారి కల సాకారం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం విద్యార్థుల సందేహాలను ఫైజల్ హుస్సేన్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ బీ చెన్నకేశవరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ సీడీ నాయుడు, గ్లోబల్ రిలేషన్షిప్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చక్రవర్తుల, స్టూడెంట్స్ ప్రోగ్రేషన్ డీన్ డాక్టర్ వై పద్మశాయి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
గ్లోబల్ రిలేషన్ కార్యాలయం..
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే విద్యార్థుల కోసం ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ మా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన సదస్సు ఎంతో ఉపయోగకరం. విద్యార్థుల భవిష్యత్తు కోసం మా కళాశాలలో గ్లోబల్ రిలేషన్ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశాం. పలు విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాం. మా విద్యార్థులకు విదేశీవిద్యపై ప్రత్యేకంగా అవగాహన కల్పించిన వై-యాక్సిస్ కన్సల్టేషన్ ఉపాధ్యక్షుడు పైజల్ హుస్సేన్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యాలకు ధన్యవాధాలు.
– డాక్టర్ బీ చెన్నకేశవరావు, డైరెక్టర్, వీఎన్ఆర్ వీజేఐఈటీ
విద్యార్థులకు ఉపయోగకరం
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సహకారంతో వై-యాక్సిస్ కన్సల్టెన్సీ నిర్వహించిన అవగాహన సదస్సుతో విద్యార్థులకు ఉపయోగకర సమాచారం లభించింది. విదేశాల్లో చదువుకోవాలనుకొనే విద్యార్థుల కల నెరవేర్చే ఎన్నో అంశాలను చెప్పారు. మంచి సదస్సు నిర్వహించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు.
– డాక్టర్ కిరణ్ చక్రవర్తుల, గ్లోబల్ రిలేషన్షిప్ ఆఫీసర్, వీఎన్ఆర్ వీజేఐఈటీ