రూ.30 లక్షలతో పనులు
పల్లె ప్రగతి నిధులతో మారిన గ్రామం రూపురేఖలు
బోథ్, మే 30: దశాబ్దాల పాటు వెలుగుచూడని గ్రామం. స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారింది.. కొత్త పంచాయతీగా మారడంతో పల్లె ప్రగతి, ఇతర పథకాల కింద మంజూరైన నిధులతో మందబొగూడలో డంప్యార్డు, శ్మశానవాటిక, డ్రైనేజీలు నిర్మించడంతో పాటు ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. బోథ్ మండలం మందబొగూడ గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. రఘునాథ్పూర్, కుచ్చిరాలతండాను కలిపి మందబొగూడను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 718 మంది జనాభా, 154 కుటుంబాలు ఉన్నాయి. ఇది గతంలో అందూర్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉండేది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడింది. కానీ స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారింది. మూడేళ్ల క్రితం కొత్త గ్రామ పంచాయతీగా ఆవిర్భవించి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నది.
ప్రగతి పరుగులు..
ఇప్పటి వరకు రూ. 32లక్షలు పల్లె ప్రగతి, ఇతర పథకాల కింద నిధులు మంజూరయ్యాయి. రూ 2.50లక్షలతో డంప్ యార్డు, రూ.12.50లక్షలతో శ్మశానవాటిక, రూ. 4 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.6 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. అవసరమున్న చోట సీసీ రోడ్లు కూడా వేశారు. అన్ని గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఈ మూడు పల్లెల్లో ఏళ్లు గడిచినా పంచాయతీ నుంచి నిధులు రాక అభివృద్ధి పనులు జరిగేవి కావు. ప్రతి ఏటా పంచాయతీకి వస్తున్న నిధులతో చేపడుతున్న పనులతో పల్లెల రూపు రేఖలు మారిపోతున్నాయి.
అభివృద్ధి పనులు చేపడుతున్నాం..
పంచాయతీ పరిధిలోని రఘునాథ్పూర్, కుచ్చిరాలతండాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. వచ్చిన నిధులను సమానంగా ఖర్చు చేస్తున్నాం. పంచాయతీ పాలకవర్గాన్ని మూడు గ్రామాల ప్రజలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున అందరిని సమాన దృష్టితో చూస్తున్నాం. రాబోయే రోజుల్లో పంచాయతీని అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
-ఆడె చాంగుబాయి, సర్పంచ్, మందబొగూడ