హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. కాంగ్రెస్ ఉచిత బస్సు స్కీం, ఆటో డ్రైవర్ల పాలిట శాపం.. కాంగ్రెస్ పాలనలో 20 మంది ఆటో డ్రైవర్ల మృత్యువాత.. అంటూ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయిన వైనంపై ఎందరో పోస్టులు, వీడియోలను పెడుతూ మానవీయతను చాటుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల వివరాలతో ‘ఆటో డ్రైవర్ల సూసైడ్ రిపోర్ట్’ అన్న పోస్ట్ సోషల్ మీ డియాలో వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోయారంటూ జాబితాను షేర్ చేస్తున్నారు. ఆ జాబితాకు పేపర్ క్లిప్పింగులు, టీవీ చానెళ్ల వీడియోలు జత చేస్తూ ఆధారాలతో షేర్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారి చావులపై హేళనగా మాట్లాడుతున్నదని నెటిజన్లు ఫేస్బుక్, ఎక్స్ వేదికల్లో కామెంట్లు పెడుతున్నారు. మృతులు సారయ్య, సతీశ్గౌడ్, సత్యనారాయణ, అనిల్, హమీద్, అక్బర్, రాహుల్, నగేశ్, అరుణ్కుమార్, రవి, రామలింగయ్య తదితరుల ఫొటోలను షేర్ చేస్తూ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.