హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది డ్రైవర్లున్నారని, కుటుంబాలతో కలిసి 40 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ నాయకులు పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని సంస్థ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. జీవనభృతి కింద నెలకు రూ.15వేలు ప్రభుత్వం అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజుల్లోనే తమ బతుకులు అగమ్యగోచరంగా మారాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన పదేండ్లలో ఎప్పుడూ ఆటో డ్రైవర్లు ఇంతలా ఇబ్బంది పడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ బతుకుల కోసం పోరాటం చేయాల్సి వస్తుండడం బాధాకరమని పేర్కొన్నారు. ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో కార్మికులలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలన్నారు. ఆటో మీటర్ రేట్లు పెంచి కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఓలా, ఉబర్ సంస్థలను ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వారం రోజుల్లోగా పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డిపోల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ కార్యదర్శి చిన్నం బాల నర్సయ్య, నాయకుడు శాతం రమేశ్ మాట్లాడుతూ.. బండి నడిపితేనే ఇల్లు గడిచే డ్రైవర్ల జీవితాలను పట్టించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్కూల్ వ్యాన్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్టీయూ ప్రెసిడెంట్ నిరంజన్, డీ పర్వేజ్, బాలునాయక్, మహ్మద్ వాజిద్, చంద్రమౌళి, ఎండీ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
జన్నారం: మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు శనివారం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రారంభించడానికి కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఇసాక్, సుధాకర్ నాయక్ వచ్చారు. ఆటో యూనియన్ మండలశాఖ అధ్యక్షుడు నసీరుద్దీన్ వారితో వాగ్వాదానికి దిగారు. ఈ పథకం వల్ల తాము ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్ సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్, మొగిలి, శంకర్, రాజన్న, చాంద్పాషా, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.