జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 16 : మూడోందల ఆటో కిరాయి విషయంలో ఓ ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ను దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామ శివారులో చోటుచేసుకున్నది. డీఎస్పీ రఘుచందర్ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుతారిపేటకు చెందిన ఆటో డ్రైవర్ నయీమొద్దీన్(50) తన ఆటోలో ప్రయాణికులను ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ధర్మపురికి తీసుకుని వెళ్తున్న సమయంలో బిహార్ రాష్ట్రం సంస్తిపూర్ జిల్లాకు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని ఆటో ఎక్కారు. గుల్లపేటలో దిగేందుకు రూ.300 కిరాయి మాట్లాడుకున్నారు.
గుల్లపేటలో దిగిన తర్వాత కిరాయి చెల్లింపు విషయంలో ఆ ఇద్దరు వ్యక్తులు డ్రైవర్తో గొడవకు దిగారు. నయీమొద్దీన్ మెడను గుడ్డతో నులిమి, బండరాయితో దాడి చేసి క్రూరంగా హత్య చేశారు. తర్వాత మృతుడి వద్ద ఉన్న సెల్ఫోన్ను దొంగిలించి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జగిత్యాల రూరల్ పోలీసులు డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను సేకరించి తక్షణమే నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి హత్య సమయంలో ఉన్న రక్తపు మరకల దుస్తులు, దొంగిలించిన సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ భినందించారు.