స్టేషన్ఘన్పూర్, జనవరి 14 : బతుకుదెరువు పోతుందన్న దిగులుతో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని మీదికొండ గ్రామంలో చోటుచేసుకున్నది. మీదికొండ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వేముల సత్యనారాయణ (55) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈయనకు ఎలాంటి ఆస్తులు లేవని, పిల్లల పెండ్లిళ్లు కూడా చేయలేదని, అతని మృతితో కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు గుర్రం మధుమోహన్, గౌరవాధ్యక్షుడు జయపాల్, కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పండుగ పూట కూడా గిరాకీ లేకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ముగ్గురు కూతుళ్లను ఎలా చదివించి, వివాహాలు ఎలా చేయాలి? అని ఆలోచించి, గుండెపోటుకు గురై సత్యనారాయణ మృతి చెందినట్టు వారు పేర్కొన్నారు. అతడి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.