హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ పులుల అభయారణ్యం (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్)లో 14 పులులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతేడాది గణనలో 12 పులుల కదలికలు నమోదు కాగా ఈసారి వాటి సంఖ్య పద్నాలుగుకు పెరిగింది. నాలుగో విడత వన్యప్రాణి గణనలో భాగంగా ఇండియాలోని టైగర్ రిజర్వ్లలో వన్యప్రాణులను లెక్కించే ప్రక్రియ ప్రస్తుతం నడుస్తున్నది. ఇందులో భాగంగా అమ్రాబాద్ అభయారణ్యంలో పులులు సంచరించే ప్రాంతాల్లో కెమెరాల ద్వారా వాటి కదలికలను నమో దు చేశారు. నల్లమల అటవీ ప్రాంతం 2,611 చదరపు కిలోమీటర్ల పరిధిలో మొత్తం 14 పులులు, 43 రకాల ఇతర వన్యప్రాణుల కదలికలు నమోదయ్యాయని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ వెల్లడించారు. అరణ్యభవన్లో శుక్రవారం వార్షిక నివేదికను విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. పులుల సంఖ్య మరింత పెరిగేందుకు వీలుగా అటవీ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాకాహార జంతువుల లభ్యత సైతం భారీగా పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (ఎస్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, వైల్డ్లైఫ్ అదనపు పీసీసీఎఫ్ సిద్ధానంద్ కుక్రేటీ, అదనపు పీసీసీఎఫ్లు ఎంసీ పర్గాయిన్, వినయ్కుమార్, ఎస్కే సిన్హా, అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ బీ శ్రీనివాస్, డీఎఫ్వో, ఎఫ్డీవో పాల్గొన్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 11 రేంజ్లు ఉండగా 9 రేంజ్లలో రేంజ్లలో గణన చేశారు. దోమలపెంట- మణ్ణనూరు, అమ్రాబాద్- మణ్ణనూరు, అచ్చంపేట- లింగల్- కొల్లాపూర్- కంబాలపల్లి- దేవరకొండ ఇలా మూడు బ్లాక్లుగా విభజించి లెక్కించారు. మొత్తం 276 గ్రిడ్లను ఎంచుకొని ప్రతి గ్రిడ్లో ఒక కెమెరాను అమర్చారు. ఒక్కో కెమెరా 0.8 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేలా ఏర్పాటు చేశారు. మొత్తం 45 రోజుల వ్యవధిలో 552 కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ప్రతి కెమెరా నుంచి రెండుమూడు సార్లు డేటాను డౌన్లోడ్ చేసుకొని పరిశీలించగా 14 పులులు ఉన్నట్టు తేలింది. ఇందులో 5 మగ, 7 ఆడ పులులు ఉండగా మరో 2 పులులను గుర్తించలేకపోయారు. ఇందులో 10 పులులు గతంలో లెక్కించినవే కాగా కొత్తగా నాలుగు పులులను గుర్తించారు. కాగా లెక్కలోకి వచ్చినవి 14 పులులే అయినప్పటికీ అమ్రాబాద్ రిజర్వ్లో అంత కంటే ఎక్కువ పులులు (లెక్కలోకి రానివి) కూడా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
1990 వరకు అడవిలో వన్యప్రాణుల గణనకు శాస్త్రీయ విధానం అంటూ లేదు. కనిపించిన ప్రతి జీవినీ లెక్కించేవారు. దీంతో లెక్కించిన వాటినే లెక్కించడం, గుర్తించనవి ఏమైనా ఉంటే అవి అసలు లెక్కలోకే రాకపోవడం లాంటి సమస్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం పులులు, వన్యప్రాణులను లైన్ ట్రాన్సెక్ట్ మెథడ్, వాటర్హోల్ సెన్సెస్ పద్ధతుల ఆధారంగా లెక్కిస్తున్నారు. పులులతో పాటు వాటి వేటకు ఆధారమైన ఇతర జంతువులనూ గణిస్తున్నారు. ప్రతి చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో జింకలు, చుక్కల దుప్పులు, అడవి పందులు, సాంబార్, లంగూర్ తదితర జంతువుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటున్నారు. నివేదికను అనుసరించి అభయారణ్యంలో చుక్కల దుప్పులు, అడవిపందుల ఎక్కువగా ఉన్నాయి.