సాధారణంగా రాష్ట్రంలో 60 నుంచి 70 రోజుల వర్షం, 15 రోజుల చొప్పున నాలుగు నుంచి ఐదు దశల్లో వానలు కురుస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యమైంది. జూలై చివరిలో మంచి వర్షాలు కురిసినా, ఆగస్టులో వరుణుడు ముఖం చాటేశాడు. లోటు వర్షపాతం నమోదు కావటానికి ఎల్నినో ప్రధాన కారణం. సెప్టెంబర్లో రాష్ట్రంలో మెరుగైన వర్షాలు కురుస్తాయని అంచనా.
– వాతావరణ శాఖ
Rains | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో ఈ ఏడాది జూన్లో లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో అధిక వర్షాలతో (489.9 మి.మీ) ఆ లోటు తీరిపోయింది. జూలైలో జడిపించిన వరుణుడు, ఆగస్టులో కరుణించలేదు. 1972 ఆగస్టు తర్వాత ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) డాటా ప్రకారం ఆగస్టులో రాష్ట్రంలో కేవలం 74.4 మి.మీ సగటు వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 60% తక్కువని అధికారులు వెల్లడించారు. 1960 నుంచి రాష్ట్రంలో ఇది మూడో అత్యల్ప లోటు వర్షపాతం. 1960లో 67.9 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, 1968లో 42.7 మి.మీ, 1972లో 83.2, తాజాగా ఏడాది ఆగస్టులో 74.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
సాధారణంగా తెలంగాణలో 120 రోజులు వర్షకాలం ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. రాష్ట్రంలో 60 నుంచి 70 రోజుల వర్షం, 15 రోజుల చొప్పున నాలుగు నుంచి ఐదు దశల్లో వానలు కురుస్తాయని చెప్పారు. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యమైందని, దీంతో జూన్లో లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. జూలై చివరిలో మంచి వర్షాలు కురిసినా, ఆగస్టులో వరుణుడు ముఖం చాటేశాడని వెల్లడించారు. ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని చెప్పారు. లోటు వర్షపాతం నమోదు కావటానికి ఎల్నినో ప్రధాన కారణంగా వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
జిల్లాల వారీగా చూస్తే వికారాబాద్లో అత్యధికంగా 93%, జనగామలో 90%, సిద్దిపేటలో 83%, రంగారెడ్డి, సంగారెడ్డిలో 82% చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో ఇప్పటి వరకు 44 మండలాల్లో అత్యధికంగా, 284 మండలాల్లో అధిక, 242 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకా 42 మండలాల్లో లోటే ఉంది.
సెప్టెంబర్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికరులు చెబుతున్నారు. హిందూ మహాసముద్రం అంతటా ఉష్ణోగ్రతలు మారి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో రాష్ట్రంలో మెరుగైన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ రెండో వారంలోనూ ఒక వారం పాటు రుతుపవనాల విరామం ఉంటుందని, ఆ తర్వాత రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. దీంతో వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 31న గురువారం సాయంత్రం నుంచే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, శుక్ర, శని, ఆదివారాలు మాత్రం ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉదయం పొగ మంచు ఉంటుందని, మధ్యాహ్నం తర్వాత వానలు పడతాయని వివరించింది. మొత్తంగా ఈ వానకాలం సీజన్లో సాధారణ వర్షపాతం నమోదైందని, సెప్టెంబర్ నెలలో ఒకటో తేదీ నుంచే వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది.