హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు తెలంగాణ నిలయంగా ఉన్నదని, రాష్ట్రంలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. వాటి విశిష్టతలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలవారికి వివరించి తెలంగాణను సందర్శించేలా చూడాలని టూర్, ట్రావెల్ ఆపరేటర్లను కోరారు. బెర్లిన్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టూరిజం, కల్చరల్ ఎగ్జిబిషన్లో భాగంగా బుధవారం ఆయన పలువురు టూర్, ట్రావెల్ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. తెలంగాణలో బౌద్ధ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగా ప్రపంచస్థాయిలో బుద్ధవనం ప్రాజక్టు నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఐటీతోపాటు వైద్య, ఔషధ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిందని, ఐటీలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఎదిగిందని చెప్పారు. నామమాత్రపు ధరలకే అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్న నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్.. కరోనా సమయంలో యావత్ ప్రపంచానికి వ్యాక్సిన్లను సరఫరా చేసి తన ఘనతను చాటుకున్నదని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ లాంటి పండుగలు ఎంతో ప్రత్యేకమైనవని తెలిపారు. రాష్ర్టానికి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా టూర్, ట్రావెల్ ఆపరేటర్లు కృషిచేయాలని కోరారు. సమావేశంలో కేంద్ర పర్యాటక శాక కార్యదర్శి అర్వింద్ సింగ్, భారత రాయబారి పర్వతనేని హరీశ్, రాష్ట్ర టూరిజం శాఖ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.