Telangana | హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్ లోకల్ కోటాగా మార్చడం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరో శాఖలో 40 శాతం. ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో జరిగిన అన్యాయాల పరంపర. తరతరాలుగా మన కొలువులను కొల్లగొట్టిన వైనం. ఇలాంటి అన్యాయాలకు తెలంగాణ సర్కారు చరమగీతం పాడింది. మన కొలువులు మన బిడ్డలే దక్కేలా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చింది. ఇదంతా సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సర్కారు కొలువుదీరడంతోనే సాధ్యపడిందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఒకే ఇంట్లో తల్లీ కూతురు, తండ్రీ కొడుకు, అన్నా తమ్ముడు, అక్కా చెల్లెలు.. ఇప్పుడు అంతా కలిసి సర్కారీ కొలువులను సొంతం చేసుకున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులైపోతున్నారు.. నేడు కొలువుల ఫలితాలు వచ్చాయంటే ఒకే ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురికి ఉద్యోగాలొస్తున్నాయి. పదేండ్లలో పటిష్టమైన విధానాలను రూపొందించడం, పక్కాగా అమలు చేయడంతోనే ఇదంతా సాధ్యపడింది. గతంలో మన బిడ్డలు పడ్డ అన్యాయాలు తెలిసిన వారే నేడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీంతో గతం లో చోటుచేసుకున్న అన్యాయాలు, వివక్ష మచ్చుకైనా కనపడడం లేదు. ఫలితంగా తెలంగాణ భూమిపుత్రులే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మన కొలువులను మనవాళ్లే దక్కించుకుంటున్నారు. ఇప్పుడు గతం తాలూకు అన్యాయాలు లేవు. అసమానతలు అసలే లేవు. వివక్ష కానరావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వేసిన అడుగులే అన్యాయాలను రూపుమాపేందుకు దారి చూపాయి. తెలంగాణ ఉద్యోగార్థులకు దారి దీపంలా మారాయి. తెలంగాణను ఇతర ఏ పార్టీ చేతిలో పెట్టినా, మరే ప్రభుత్వం పాలించినా ఇంత నిబద్ధతతో వ్యవహరించేవారు కాదనేది సుస్పష్టం. మళ్లీ అవే అక్రమాలు, ఉమ్మడి పాలనలో జరిగిన అన్యాయాలే పునరావృతమయ్యేవి.
బీఆర్ఎస్ అమలుపరిచిన విజన్ ఇదీ…
☞ ఇది వరకు రాష్ట్రంలో రెండు జోన్లు, 10 జిల్లాలు ఉండటంతో కొంత విద్యావకాశాలున్న వారికే ఉద్యోగాలు దక్కేవి. కానీ రాష్ర్టాన్ని భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా 7 జోన్లు, 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది బీఆర్ఎస్ సర్కార్. ఈ ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో మారుమూల ప్రాంతాల వారికి ఆయా జిల్లాలోని పోస్టుల్లో పోటీ పడే అవకాశం దక్కింది. కొత్త జిల్లాలు, జోనల్ సిస్టం ప్రకారం ఉద్యోగుల శాశ్వత కేటాయింపును పూర్తి చేసింది. దీంతో జిల్లాలు, జోనల్ వారీగా ఖాళీల సంఖ్య తేలగా, నియామకాల భర్తీని చేపట్టింది.
☞ రాజధాని, హెడ్క్వార్టర్, హైదరాబాద్ ఫ్రీ జోన్ పేరుతో జరిగిన అక్రమాలు కోకొల్లలు. ఆ ఫ్రీ జోన్ను తెలంగాణ సర్కార్ ఎత్తివేసింది. హైదరాబాద్.. జోన్-6 (చార్మినార్)లో అంతర్భాగం కాగా, మల్టీజోన్-1లోనూ భాగమయ్యింది. దీంతో జిల్లా పోస్టులకు జిల్లా వారు, జోనల్ పోస్టులకు జోనల్, మల్టీజోన్ పోస్టులకు మల్టీజోన్ పరిధిలోని వారు పోటీపడేలా అద్భుత పరిష్కారాన్ని చూపింది.
☞ స్టేట్ కేడర్ పోస్టులంటూ గతంలో అన్ని జిల్లాల వారు ఎగరేసుకుపోయేవారు. దీనికి ప్రభుత్వం ముగింపు పలికింది. స్టేట్ కేడర్ పోస్టులను తీసేసి మల్టీజోన్ కేడర్ పోస్టుల వరకు పరిమితం చేసింది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులే ఇప్పుడు స్టేట్ కేడర్ ఉద్యోగులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలను మల్టీజోన్ వరకే పరిమితం చేసింది.
☞ పరిపాలన సజావుగా సాగేందుకు 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ద్వారా 36 వేలు భర్తీ చేయగా, గతేడాది 80,039 ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించింది. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 18,263 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది.
☞ కొత్త ఉద్యోగాల భర్తీ కోసం రూ.7 వేల కోట్లు అవసరం ఏర్పడగా, 2023 బడ్జెట్లో ప్రభుత్వం వెయ్యి కోట్లను కేటాయించింది.
☞ గతంలో స్థానికులుగా నిర్ధారించేందుకు 4 నుంచి 10వ తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని పరిగణిలోకి తీసుకోగా, అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. పోస్టులున్న ప్రాంతంలో 5 నుంచి 10వ తరగతి వరకు చదివినట్లు దొంగ సర్టిఫికెట్లతో పెద్ద దందా జరిగేది. దీనికి ముగింపు పలికి స్థానిక కోటా నిర్వచనాన్ని మార్చింది. గతంలో 4-10 తరగతుల్లో నాలుగేండ్లు ఒకే జిల్లాలో చదివితే స్థానికులు కాగా, ప్రస్తుతం 1-7 తరగతుల్లో నాలుగేండ్లు చదివిన జిల్లాలో స్థానికులుగా మార్పు చేసింది.
☞ గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60-80 శాతం మాత్రమే స్థానిక కోటా రిజర్వేషన్ అమలయ్యేది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయడంతో అన్ని పోస్టులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, జోన్, మల్టీజోన్లో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉంటారు. జోను, మల్టీజోన్లలో 5 శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు మిగతావారు పోటీ పడవచ్చు.
☞ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో స్థానిక కోటా గతంలో అమలయ్యేది కాదు. దీంతో అనేక కార్పొరేషన్లల్లో స్థానికేతరులు ఉద్యోగాలు కొల్లగొట్టారు. దీనికి సర్కారు చరమగీతం పాడింది. ఆయా సంస్థల్లోనూ 95 శాతం స్థానిక కోటాను వర్తింపజేసింది.
☞ అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి వయోపరిమితిని సడలించించింది. ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పదేండ్లకు పెంచింది. ఈ నిర్ణయంతో ఓబీసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల గరిష్ట వయోపరిమితి అమలవుతున్నది. ఎక్కడా లేనివిధంగా మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలకు 18 నుంచి 54 ఏండ్లవారు పోటీ పడుతున్నారు. ఈ అవకాశంతో ఇంటిల్లిపాదీ ఉద్యోగాలకు పోటీపడే అవకాశానిచ్చింది.
☞ 2014, జూన్ 2వ తేదీనాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నవారిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. మొత్తంగా 5,544 మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేయగా, దీంట్లో 3,897 మంది ఉద్యోగులు విద్యాశాఖకు చెందినవారే ఉన్నారు. వీరిలో అత్యధికులు 2,909 మంది జూనియర్ లెక్చరర్లే. 184 మంది జూనియర్ లెక్చరర్లు (ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలో 837 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, కార్మిక ఉపాధి కల్పనశాఖలో 230 మంది సహాయ శిక్షణాధికారులు ఉన్నారు. గౌరవ వేతనంపై ఆధారపడ్డ 20,555 మంది వీఆర్ఏలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. గురుకులాల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు సైతం రెగ్యులరైజ్ అయ్యారు.
☞ అన్యాయాలకు, అసమానతలకు తార్కాణంగా ఉన్న ఇంటర్వ్యూ విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ విధానాలను రద్దు చేసింది. పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా, కేవలం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల భర్తీని చేపడుతున్నది. గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కావొద్దనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నది.
☞ అటెండర్ నుంచి ఆర్డీవో దాకా 95 శాతం లోకల్ రిజర్వేషన్ను అమలు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్-1 ఉద్యోగాలకు గతంలో లోకల్ రిజర్వేషన్ వర్తించేదికాదు. స్టేట్ కేడర్ పోస్టులను మల్టీజోన్ పోస్టులుగా మార్చడంతో ఇప్పుడా పోస్టులు కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చాయి.
☞ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 27,305 పోస్టులు భర్తీ చేయగా, తాజాగా 17,516 పోస్టులు భర్తీ చేస్తున్నారు. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11,715 పోస్టులు భర్తీ చేయగా, ప్రస్తుతం 12,150 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.
ఏడు జోన్లు
1 కాళేశ్వరం
2 బాసర
3 రాజన్న సిరిసిల్ల
4 భద్రాద్రి
5 యాదాద్రి
6 చార్మినార్
7 జోగుళాంబ
మల్టీజోన్లు
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ
జోన్లతో న్యాయబద్ధంగా నియామకాలు
అన్యాయాలు జరగొద్దని, అసమానతలకు తావు ఉండొద్దని తెలంగాణను 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లను ఏర్పాటు చేసింది. ఇదంతా 1,975 రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371-డీ ఆధారంగానే జరిగింది. మారుమూల ములుగు జిల్లాలోని అభ్యర్థులు, కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్లోని అభ్యర్థులు ఒకే సామర్థ్యాలు కలిగి ఉండరని, ఇది మరలా అసమానతలకు దారితీసే అవకాశముందని భావించిన సర్కారు స్థానికులు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా ఉత్తర్వులిచ్చింది. ఇది పరిపాలన దక్షులకు, విజన్ ఉన్న ప్రభుత్వాలకే సాధ్యం.
… కొంటు మల్లేశం