ఖైరతాబాద్, జూన్ 12: ఖమ్మంలో ఓ మైనర్పై అమానుష ఘటనను మరువక ముందే నిమ్స్లో మరో దారుణ ఘటన చో టుచేసుకొన్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. నిమ్స్ దవాఖాన ప్రాంగణం లో నూతన భవనాల నిర్మాణం జరుగుతున్నది. పనులు చేస్తూ ఓ కుటుంబం అక్కడే నివాసం ఉంటున్నది. తల్లిదండ్రులు లేని సమయంలో ఆ కుటుంబంలోని బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి.. వారు ఉంటున్న గదిలోకే తీసుకెళ్లి తలుపులు వేశాడు. ఆ చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు పరారయ్యాడు. లైంగికదాడికి యత్నించిన వ్యక్తి శంభు బండారిగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కామాంధుడి అఘాయిత్యం, భౌతికదాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ దవాఖానలోనే ఓ బాలిక చికిత్స పొందుతుండగా, అదే దవాఖాన ప్రాంగణంలో మరో బాలికపై లైంగికదాడి యత్నం జరుగడం చర్చనీయాంశమైంది.