హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : సజావుగా జరుగుతున్న ఇంటర్ వార్షిక పరీక్షల్లో పేపర్ లీకేజీ ప్రయత్నం కలకలంరేపింది. ఏకంగా అధ్యాపకులు, సిబ్బంది పేపర్ లీకేజీకి ప్రయత్నించి పట్టుబడ్డారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ పరీక్షాకేంద్రంలో ఇద్దరు లెక్చరర్లు పేపర్ లీకేజీకి ప్రయత్నించి పోలీసులకు రెడ్హ్యాండెడ్గా దొరికారు. ఈ ఘటనపై పోలీసు విచారణ చేపట్టారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆ లెక్చరర్లను సస్పెండ్ చేశారు.
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు : సీఎస్
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడేవారు ఎంత పెద్దస్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవని సీఎస్ శాంతికుమారి హెచ్చరించారు. ఇంటర్, పదోతరగతి పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై శుక్రవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలను సహించేది లేదని సీఎస్ స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షా పేపర్ లీకేజీకై ప్రయత్నించిన పలువురు అధ్యాపకులు, సిబ్బందిని అరెస్టు చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు.
నాలుగు మాల్ప్రాక్టీస్ కేసులు
శుక్రవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పేపర్ -1కు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరీంనగర్లో మూడు, నిజామాబాద్లో ఒకటి చొప్పున మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.