ఆదిలాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అడవుల జిల్లా ఆదిలాబాద్కు పచ్చదనం తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. తెలంగాణ పచ్చదనంతో వెల్లివిరియాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఆరు విడతల్లో కలిపి 10 కోట్ల మొక్కలను నాటారు. ప్రస్తుతం ఏడో విడతలో మరో 2.01 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ణయించుకొన్నారు. కాగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఒక్కరోజే 10 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ణయించుకొన్నారు. పట్టణానికి సమీపంలోని దుర్గానగర్ అటవీ ప్రాంతంలోని ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు అంటే గంట వ్యవధిలో 110 ఎకరాల్లో 3.50 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో టర్కిలో గంట వ్యవధిలో 3.03 లక్షల మొక్కలు నాటగా ఈ రికార్డు గిన్నిస్ బుక్లో నమోదైంది. దీన్ని అధిగమించేలా స్థానిక నాయకులు కృషి చేస్తున్నారు. భూమిని చదును చేసి, గుంతలు తవ్వి, మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉంచారు. ఈ కార్యక్రమానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ హాజరుకానున్నారు. కార్యక్రమం ఏర్పాట్లను శనివారం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, కిశోర్గౌడ్, పూర్ణచందర్, పురుషోత్తంలతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు.