పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 14: తనదికాని భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ రైతు కుట్ర చేశాడు. కొన్నేండ్లపాటు గొడవలుపడి కోర్టుకెళ్లాడు. తీర్పు అనుకూలంగా రాకపోవడంతో సదరు రైతుపై తుపాకీతో హత్యకు యత్నించి గురి తప్పడంతో పరారయ్యాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన క్వాశ్రీరాంపూర్ మండలం పెద్దంపేటలో జరిగింది. ఆదివారం పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లికి చెందిన ముస్కు మల్లారెడ్డికి పెద్దంపేట్ గ్రామ శివారు సర్వేనంబర్ 365లో ఐదెకరాల భూమి ఉంది. ఆ భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన ముస్కు రామయ్య (57)కు మధ్య వివాదం జరుగుతున్నది. కోర్టు ముస్కు మల్లారెడ్డికి అ నూకులంగా తీర్పు ఇవ్వడంతో రామ య్య జీర్ణించుకోలేకపోయాడు.
మల్లారెడ్డిని హతమార్చితేనే భూమి సొంత మ వుతుందని, కుటుంబసభ్యులు భయపడి భూమి వదులుకుంటారని భావిం చి హత్యకు ప్లాన్ చేశాడు. కొదురుపాక ఇటుక బట్టీలో పనిచేసినప్పుడు పరిచయమైన ఉత్తర్ప్రదేశ్కు చెందిన వ్యక్తి సహకారంతో ఫిబ్రవరి 20న ఆగ్రాకు వెళ్లి రూ.30వేలతో తుపాకీ, 6బుల్లెట్లు కొన్నాడు.
మార్చి 29న ఉదయం 11 గంటలకు మల్లారెడ్డి తన మక్క చేనులో నీళ్లు పెడుతుండగా రామయ్య వెళ్లి కాల్పులు జరిపాడు. అయితే.. తుపాకీ గురి తప్పడం, మల్లారెడ్డి గమనించి గట్టిగా కేకలు వేయడంతో రామయ్య పరారయ్యాడు. మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలించి ఆదివారం తన ఇంట్లోనే రామయ్యను అదుపులోకి తీసుకున్నారు.ఇంటి ఆవరణలో దాచిన తుపాకీతోపాటు నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి ఎస్సైలు లక్ష్మణరావు, మల్లేశ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.