జమ్మికుంట, జూలై 6: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్కు చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూరపెల్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్లో సిబ్బందిపై సోమవారం అర్ధరాత్రి మూకుమ్మడిగా దాడులు చేసేందుకు యత్నించారు. పైసలు వసూలు చేస్తూ కొన్ని ట్రాక్టర్లను వదిలిపెడుతున్నారని, అందరి ఇసుక వాహనాలు ఎందుకు వదిలిపెట్టడం లేదు ? అంటూ హంగామా చేశారు. ఈ ఘటన డివిజన్ ఖాకీలను ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఏసీపీ మాధవి రంగంలో దిగారు. దాడికి యత్నించిన ఘటనలో ఎక్కువ సంఖ్యలో ఇసుక మాఫియా సభ్యులు పాల్గొనగా.. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కేవలం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలిసింది.