హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి వెన్నుదన్నుగా నిలిచి నిత్యం నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ.. లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న సిబ్బందిపై దాడులకు దిగితే సహించబోమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు, దూషణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే జరిగిన ఘటనలపై అధికారులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారని, బాధ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు.
మహాలక్ష్మి పథకం అమలులోనూ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, సంస్థకు సిబ్బందే బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని గురువారం ట్విట్టర్లో సజ్జనార్ కోరారు. కాగా, ‘మహాలక్ష్మి’ పథకం అదనపు బస్సుల ఏర్పాటుపై టీఎస్ఆర్టీసీ దృష్టిసారించింది. తక్కువ ఆదా యం వచ్చే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లే రూట్లలో బస్సు సర్వీసులను తగ్గించాలని ఆర్టీసీ భావిస్తున్నది.