NHRC | హైదరాబాద్ : గిరిజన యువకుడిపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత నెల నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే గిరిజన యువకుడు యూరియా కోసం ధర్నాలో పాల్గొన్నాడు. ఈ కారణంతో వాడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్స్ చట్ట వ్యతిరేకంగా అతన్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చి కులం పేరిట దూషించారు. అంతటితో ఆగకుండా ఇష్టానుసారంగా కొట్టి అక్రమ కేసులు బనాయించారు.
ఆ విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్తే మళ్లీ కొడతామని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్ బెదిరించినట్టు అదేవిధంగా బాధితుడి భార్య దీనాను కూడా దుర్భాషలాడారు. ఈ ఘటనపై న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై ఇవాళ జాతీయ మానవ హక్కుల సంఘం విచారించింది. ఈ సంఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ చేపట్టి ఘటనకు కారణమైన ఎస్ఐ, కానిస్టేబుల్ను విధుల నుండి తొలగించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బాధితుడికి సరైన వైద్య సదుపాయం అందించి నష్టపరిహారం కూడా చెల్లించి పూర్తి నివేదిక 4 వారాల్లోపు కమిషన్కు తెలపాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.