హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్కు చెందిన ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శిస్తూ, దాడి చేస్తూ, దూషణలకు దిగిన ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, మాణిక్రావు, విజయుడు, అనిల్జాదవ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే లు విజ్ఞప్తి చేశారు. ‘భారత రాష్ట్ర సమితికి చెందిన ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులుగా ఈ లేఖను తీవ్ర ఆవేదన, ఆందోళనతో మీ దృష్టికి తీసుకువస్తున్నాము.
ఈ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న మా ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణం వెలుపల, గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాసనసభ్యుల పట్ల పోలీసు అధికారులు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరును ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు, వారి హకులపై జరిగిన తీవ్ర దాడిగా పరిగణిస్తున్నాం. ఈ ఘటనలో పలువురు శాసనసభ్యులకు గాయాలు కాగా, వైద్యచికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులపై అధికారులే ఇంతటి దౌర్జన్యానికి పాల్పడటం తీవ్రమైన విషయం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని పేర్కొన్నారు.
సోమవారం అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సు మోటోగా విచారణ చేపట్టాలని బీఆర్ఎస్కు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కోరారు. ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్లు, పోలీసు బాడీ-క్యామ్ ఫుటేజీ, ఇతర ఆధారాలను భద్రపరచి, స్వతంత్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్కు చెం దిన ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై విచారణ జరిపి, 48 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. వారి ఫిర్యాదు అనంతరం కొన్ని వీడియోలను పరిశీలించిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించారు.
ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. ‘తెలంగాణ శాసనసభలో సమావేశాల సందర్భంగా ఎస్సీ/ఎస్టీకి చెందిన శాసనసభ్యులపై దాడి, భౌతికదాడి, అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యా దు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులు/అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు 48 గంటల్లోగా వివరమైన, సమగ్రమైన విచారణ నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశిస్తున్నది’ అంటూ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. తదుపరి అవసరమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందని డీజీపీకి పంపిన లేఖలో పేర్కొన్నారు.