మోతె, ఏప్రిల్ 24: ప్రకృతి ప్రేమికుడు, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణపై గొర్రెల కాపర్లు గురువారం దాడి చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామ సమీపంలో ఉన్న తన 70 ఎకరాల అడవిలో గొర్రెల కాపర్లు గొర్రెలు మేపుతుండగా అడవిలో గొర్రెలు ఎందుకు మేపుతున్నారని మందలించడంతో గొడవకు దారితీసింది. గొర్రెల కాపర్లు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించి సత్యనారాయణపై కర్రలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాఘవాపురం గ్రామంలో తనకున్న 70 ఎకరాల్లో వివిధ రకాల చెట్లను 15 ఏండ్లుగా పెంచుతూ దట్టమైన అడవిగా మార్చారు. అందులో కొందరు గొర్రెలను మేపుతూ చెట్లను నరికివేస్తున్నారని దుశర్ల పేర్కొన్నారు. తాను ఎంతో ప్రేమగా పెంచుతున్న అడవిని నరికివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రాఘవాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య మల్లయ్య, గంగయ్య, రోషాలు, యశ్వంత్, అరుష అడవిలోకి వచ్చి తనపై దాడి చేశారని పేర్కొన్నారు. దుశర్ల సత్యనారాయణపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. భౌతికదాడులకు దిగడం, ప్రకృతిని దెబ్బతీయడం సరికాదని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దుశర్లపై దాడి అమానుషమని మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా సృష్టికర్త సంతోష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ పేర్కొన్నారు. కన్నబిడ్డల మాదిరిగా పెంచుతున్న అడవిలో గొర్రెలను మేపడాన్ని వ్యతిరేకించినందుకు దాడి చేయడం సరికాదని సూచించారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.