మరిపెడ, మార్చి 3: మహబూబాబాద్ జిల్లా మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. ఈ నెల ఒకటిన విద్యార్థులను చూడటానికి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వారికి కావాల్సిన వస్తువులను అందజేసి వెళ్లారు. ఇదే క్రమంలో ఐదుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు అదే రోజు రాత్రి పాఠశాల ఆవరణలో కూల్ డ్రింక్ తాగుతున్నారు.
ఆ సమయంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు రాత్రి పూట బయటికివెళ్లి ప్రహరీ దూకి లోపలికి వచ్చారు. జూనియర్ విద్యార్థులు గ్రౌండ్లో కనిపించడంతో వారిపై అకారణంగా కర్రలతో దాడి చేశారు. ఇందులో ఓ విద్యార్థికి గాయాలు కాగా, 2వ తేదీన ఉదయం పాఠశాల ఏఎన్ఎం ప్రథమ చికిత్స అందించింది.
మరో ఇద్దరు విద్యార్థులు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు దాడి విషయాన్ని తెలిపారు. దీంతో వారు మంగళవారం పాఠశాలకు చేరుకొని న్యాయం చేయాలని విద్యార్థులతో కలిసి గేటు ఎదుట బైఠాయించారు. అకారణంగా తమ పిల్లలపై దాడి చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ను నిలదీయగా విచారణ చేసి దాడికి పాల్పడిన ఇంటర్ విద్యార్థులను ఇంటికి పంపించినట్టు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.