యాదగిరిగుట్ట, మార్చి 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారు బుధవారం ఉదయం గరుడవాహనంపై మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనాథుడైన స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై ఊరేగారు. అర్చక బృందం, వేద పండితులు, పారాయణదారులు వేదోక్త పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ అలంకార సేవ వైభవంగా సాగింది. సాయంత్రం ప్రధానాలయ తిరు మాడవీధుల్లో స్వామివారి దివ్యవిమాన రథోత్సవం కనులపండువగా జరిగింది.
గురువారం స్వామివారి మహాపూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, దేవతోద్వాసన, దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామివారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం కొండపైకి చేరుకున్న మంత్రి మొదట స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధానార్చకుడిగా కాండూరి వెంకటాచార్యులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో గీత నియామకం పత్రం అందజేశారు.