హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఐలమ్మ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి.. ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఐలమ్మ జయంతి, వర్ధం తి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నాడు నిరంకుశ నిజాం రజాకార్లు, దేశ్ముఖ్ల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడారని గుర్తుచేశారు. తన భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్న దేశ్ముఖ్కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసి అనాటి పేరు మోసిన న్యాయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో తన భూమిని సొంతం చేసుకున్నదని కొనియాడారు. నాటి ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, అనంతరం మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని వివరించారు.