Assistant Professors | వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల నియమకానికి సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 19 వరకు మల్టీ జోనల్ వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సీఎం కేసీఆర్ దార్శనికతతో ఆరోగ్య తెలంగాణలో భాగంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే.
కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీని సైతం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే చేపట్టింది. ఆ ప్రక్రియను కేవలం ఐదు నెలల రికార్డు సమయంలోనే విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియ నిర్వహించి, ఎప్పటికప్పుడు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తూ, ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ, అర్హులు ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే అందుకు సంబంధించిన మెరిట్ జాబితాను రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది.
అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో నియామక ఉత్వర్వులను జారీ చేయాల్సి ఉండగా.. అందుకు సంబంధించిన షెడ్యూల్ను బోర్డు తాజాగా ప్రకటించింది. మల్టీ జోన్-1 అభ్యర్థులకు 15,16 తేదీల్లో, మల్టీజోన్-2 అభ్యర్థులకు 17,18 తేదీల్లో, 1,2 మల్టీజోన్లలోని సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు సంబంధించి 19న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు మొబైల్ సందేశాలను పంపించినట్లు తెలిపారు. మరిన్న వివరాలకు dme.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని బోర్డు సూచించింది.