హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ‘సారు ఇప్పుడొస్తరు..ఇంకో అరగంటలో వస్తున్నారు.. ఇంకాస్త సమయం పట్టేటట్టుంది.. మధ్యాహ్నం లంచ్ వరకు వస్తారు.. లంచ్ చేసి వస్తారు.. అగో సారు రానే వచ్చే..’ అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోసం బుధవారం రోజంతా తెలంగాణ శాసనసభ ఎదురుచూసింది. పుస్తకావిష్కరణ సభ ఉందని మంగళవారం మధ్యాహ్నం శాసనసభ సమావేశాలు వాయిదా వేయించి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సభ ప్రారంభమయ్యే సమయానికి కూడా రాలేదు. సీఎం రాకకోసం ఎదురుచూస్తూ స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ప్రశ్నోత్తరాలు ముగిసినా.. సీఎం జాడ లేకపోవటంతో స్పీకర్ జీవో అవర్ను ప్రారంభించారు. అసెంబ్లీ ఉదయం సెషన్ ఆసాంతం జీరో అవర్తోనే స్పీకర్ నెట్టుకొచ్చారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల ఇండ్ల చుట్టూ సీఎం
తెలంగాణ ప్రజాసమస్యలకంటే ఢిల్లీ పెద్దల పనులకే సీఎం రేవంత్రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని మరోసారి వెల్లడైంది. ఢిల్లీ వెళ్లిన సీఎం బుధవారం ఉదయం హెదరాబాద్ చేరుకొని శాసనసభ సమావేశాల్లో పాల్గొంటారని సీఎంవో లీకులు ఇచ్చింది. కానీ సీఎం వెళ్లిన పనిని పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగటంతోనే బిజీబిజీగా గడిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ను మంగళవారం రాత్రి కలిశారు. బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీని కలుసుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలు, సర్దుబాట్లపై వారి మధ్య ప్రధానంగా చర్చకు జరిగినట్టు తెలిసింది. మధ్యాహ్నం మూడు గంటలవరకు అక్కడే సమయం గడిచినట్టు తెలిసింది. ఆ తరువాతనే సీఎం ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానం ఎక్కినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
సీఎం రాక.. ఎజెండా లేక
శాసనసభ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో మొదలైంది. అనంతరం టీ బ్రేక్ ఇచ్చారు. అప్పటికీ సీఎం రేవంత్రెడ్డి జాడ లేకపోవడంతో స్పీకర్ జీవో అవర్ ప్రారంభించారు. ఇక జీరోఅవర్ను ఏకంగా గంటన్నరకు పైగా నడపటంతో సభ్యులే ఆశ్చర్యపోయారు. ఎందుకని ఆరాతీస్తే.. సీఎం రేవంత్రెడ్డి సభకు వస్తారనే సమాచారం ఉన్నదని, ఆయన కోసం ఎదురుచూస్తున్నారని తెలిసింది. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను సీఎం ముగించాల్సి ఉన్నదని, ఆ తరువాతనే తదుపరి ఎజెండా ఏమిటన్నదని తేలుతుందని తెలిసింది. ఎంతో విలువైన శాసనసభ సమావేశాలకు అధికారపక్షం ఎజెండా ఏమిటో స్పష్టత లేకుండా ముఖ్యమంత్రి రాకకోసం ఎదురుచూడటం ఆశ్చర్యంగా ఉన్నదని సీనియర్ సభ్యుడు ఒకరు వాపోయారు.
ఢిల్లీ టూ హైదరాబాద్
జీరో అవర్ ముగిసినా సీఎం రాకపోవడంతో.. స్పీకర్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి, అనంతరం సభను వాయిదా వేశారు. మధ్నాహ్నం మూడు గంటల తరువాత సభ మళ్లీ సమావేశమైంది. అప్పటికి సీఎం ఇంకా రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు, చాలామంది మంత్రులు సభలోకి రాలేదు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హడావుడిగా మంత్రుల చాంబర్లలోకి వెళ్లి మంత్రులను సభలోకి వెళ్లాలని ఆదేశించటం గమనార్హం. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగింది. చివరికి సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్రెడ్డి శాసనసభకు వచ్చారు. ముఖ్యమంత్రి అవసరానికి తగ్గట్టు సభా వ్యవహారాలను రూపొందించటం, సభ్యులకు ఎజెండా ఏమిటో చెప్పకపోవటం, ఒకవేళ అర్ధరాత్రో, అపరాత్రో ఎజెండా ప్రకటించినా దాన్ని అమలు చేయకపోవటం శాసనసభ చరిత్రలో కొత్త సంప్రదాయం అని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.