హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): దేశంలో పేద, ధనిక అంతరం భారీగా పెరుగుతున్నదని, ఈ అంతరం తగ్గాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశంలో ఒక శాతం ఉన్న ధనికుల చేతిలో 40 శాతం సంంపద ఉన్నదని సర్వేలు చెప్తున్నాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలవేసి నివాళి అర్పించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. దేశంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నప్పుడే నిజమైన రాజ్యాంగం అమలైనట్టని తెలిపారు.
కొందరి కోసమే పనిచేయటం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ప్రధాని అయినా.. స్పీకర్ అయినా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారేనని.. రాజ్యాంగం ముందు తన, పర బేధం ఉండకూడదని హితవు పలికారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శమని అన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తామని ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పేర్కొనడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పోటీపడి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలే తప్ప పరసర్పర విమర్శలు చేసుకుంటే వాటి వల్ల ఫలితం ఉండదన్నారు. ఈమధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.