ఖమ్మం, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జూలైలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రైతులతో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి ముట్టడిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. ఆరు నెలల్లోనే మంత్రులకు అహంకారం పెరిగిపోయిందని, రైతులను అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వానకాలం పంటకైనా సీజన్కు ముందుగానే జూన్లోనే రైతుభరోసా అందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. సత్తుపల్లి, బోనకల్లు, ఖమ్మంరూరల్ మండలం బారుగూడెంలో జరిగిన జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో మీడియాతో మాట్లాడారు.
ఆయా సమావేశాల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల కాళ్లు మొక్కి వంద రోజుల్లో రుణమాఫీ, రైతుభరోసా రూ.7,500, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని నమ్మించి మోసగించిందని మండిపడ్డారు. వడ్లకు రూ.500 బోనస్ అడిగిన పాపానికి అవగాహనలేక మాట్లాడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి అనడం రైతులను అవమానపరచడమేనని పేర్కొన్నారు. సన్నాలను పండిస్తే పంటకు తెగులెక్కువ, దిగుబడి తక్కువగా వస్తుందని చెప్పారు. దొడ్డు వడ్లు 120 రోజుల్లో దిగుబడి వస్తే, సన్న వడ్లు 150 రోజుల్లో వస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని 99% మంది రైతులు దొడ్డు వడ్లను పండిస్తారని కేవలం ఒక్కశాతమే సన్నవడ్లను పండిస్తారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లు అయినా పాలనపై పట్టు సాధించలేక ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గతంలో సీఎం కేసీఆర్తో మాట్లాడి గోదావరి జలాలను తెచ్చారని హరీశ్రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇయ్యలేక పంటలను ఎండబెట్టిందని మండిపడ్డారు. వర్షాలు పడుతున్నాయి మహాప్రభో.. జీలుగు, జను ము విత్తనాలు అందించాలని అధికారులకు రైతులు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. విత్తనాల పంపిణీ కి అనుమతిలేదని తల్లాడలో అధికారి చెప్పడంపై ధ్వజమెత్తారు.
హైదరాబాద్పై కుట్రలు
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ, ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రశ్నించేతత్వం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా, నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర, ఉపేందర్రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ వచ్చింది.. కష్టాలు తెచ్చింది..; హరీశ్రావు వద్ద గోడు వెళ్లబోసుకున్న రైతులు
‘మాయదారి కాంగ్రెస్ వచ్చి మా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టింది’ అంటూ రైతులు హరీశ్రావు ఎదుట తమ ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ తమను కంటికిరెప్పలా కాపాడుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు. సత్తుపల్లిలో పట్టభద్రుల సమావేశానికి హాజరై తిరిగి ఖమ్మం వస్తున్న క్రమంలో తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామ శివారున ఆ గ్రామానికి చెందిన రైతులు కల్యాణపు చిన్నసత్యం, కల్యాణపు కృష్ణయ్య, రామిశెట్టిపల్లి లక్ష్మణరావు మరికొంతమంది రైతులతో కలిసి హరీశ్రావు వాహనాన్ని ఆపారు. వారిని గమనించి వాహనం దిగిన హరీశ్రావు.. ‘ఏం పెద్దాయానా.. బాగున్నారా? వ్యవసాయం ఎలా ఉన్నది? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది?’ అంటూ పలుకరిస్తూ వారితో కలిసి పొలాల్లోకి వెళ్లారు. ‘ఏం చెప్పమంటారూ సారు.. మా బాధలు వర్ణనాతీతతం’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం వారు తమ బాధలన్నింటినీ హరీశ్రావు ఎదుట వెళ్లబోసుకున్నారు. ‘సారూ.. రైతుల పక్షాన అసెంబ్లీలో పోరాడండి. మేమంతా కదిలివచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాం. అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం’ అని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. ‘అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ ఇస్తానంటున్నది. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వనంటున్నది. పంటలకు సాగునీళ్లు ఇవ్వలేదు. మోటరు వేసుకునేందుకు కరెంటూ ఇవ్వలేదు. ఆఖరికి పంటల పెట్టుబడికి రైతుభరోసా కూడా ఇవ్వలేదు’ అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.