TS Cabinet | కొత్తగా కొలువుదీరిన సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సెక్రటేరియట్లో భేటీ అయ్యింది. సమావేశానికి మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ ఆరు గ్యారంటీలపై చర్చించింది. అనంతరం కేబినెట్లో చర్చించిన అంశాలను మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు, ప్రజా సమస్యలపై భేటీలో సుదీర్ఘంగా చర్చించామన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు తెలియజేయాలని, అన్ని అంశాలను తెలియజేయాలని అధికారులను కోరామన్నారు. 2014-2023 డిసెంబర్ 7 వరకు ఆర్థిక వ్యవహారాలు, అన్ని విభాగాలకు సంబంధించి ఖర్చుల వివరాలు ప్రజలకు తెలియాలన్నారు. అలాగే సభలో రెండు ప్రధాన గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. రెండు ప్రధాన గ్యారంటీలపై ఆయా విభాగాల అధికారులతో రేపు సీఎం సమావేశం నిర్వహిస్తారన్నారు. ఈ నెల 9న రెండు గ్యారంటీలను అమలులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సోనియా పుట్టిన రోజు నుంచే రెండు గ్యారంటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రేపు విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష చేస్తారని, రైతులకు 24గంటల కరెంటుతో పాటు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై చర్చిస్తామన్నారు. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశామని, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నారు. ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు గ్యారంటీని సైతం అదే రోజు నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. మార్పును కోరుకునే వారికి రాబోయే ఐదేళ్లలో మార్పును చూపిస్తామన్నారు. మహిళలు 9వ తేదీ నుంచి ఆధార్ లేదా ఏదేని గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎస్ శాంతికుమారి ప్రారంభిస్తారన్నారు.