Medigadda | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని విశ్రాంత ఇంజినీర్లు అంగీకరించలేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని రిటైర్డ్ ఇంజినీర్లు పేర్కొన్నారు. నిర్మాణానికి అంగీకరించకపోవడానికి గల పరిస్థితులు వేరని, సీఎం వెల్లడించిన అంశాలు వేరని స్పష్టంచేశారు. మేడిగడ్డ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ‘కాళేశ్వరం-తెలంగాణ జీవధార’ పుస్తకాన్ని ఎందుకు తీసుకొస్తామని ప్రశ్నించారు.
రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు సరికాదని హితవు పలికారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించి ఎల్లంపల్లి వరకు కాలువ ద్వారా గోదావరి జలాలను తరలించాలని తొలుత నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు స్వతంత్రంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని బరాజ్ ప్రతిపాదిత అంశాలను పరిశీలించారు. మేడిగడ్డ నుంచి కాలువ నిర్మించి ఎల్లంపల్లి వరకు జలాలను తరలించడం కష్టమని అభిప్రాయపడ్డారు.
తమ్మిడిహట్టి వద్ద లేదంటే వేమనపల్లి వద్ద బరాజ్ నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ తర్వాత ఇదే అంశంపై వ్యాప్కోస్తో సర్వే చేయించగా, ఆ మార్గంలో 22 క్లిష్టమైన పాయింట్లు ఉన్నట్టుగా తేలడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పలు సమీక్షల అనంతరం మేడిగడ్డ నుంచి కాలువ ద్వారా కాకుండా, నదీమార్గంలోనే ఎగువ ఎల్లంపల్లి వరకు జలాలను తరలించాలని నిర్ణయించింది.
ఈ ప్రతిపాదనకు రిటైర్డ్ ఇంజినీర్ విద్యాసాగర్రావుతోపాటు ఇతర విశ్రాంత ఇంజినీర్లందరూ ఏకీభవించారు. మేడిగడ్డ నుంచి జలాలను తరలించేందుకు చేసిన అలైన్మెంట్కు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలను మొత్తంగా మేడిగడ్డ వద్ద బరాజ్నే వ్యతిరేకించినట్టు సీఎం రేవంత్ చెప్పడాన్ని ఖండించారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభేదిస్తే పుస్తకం ఎందుకు?
మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని, రీ ఇంజినీరింగ్ను విశ్రాంత ఇంజినీర్లు వ్యతిరేకించారని చెప్పడాన్ని కూడా పలువురు ఖండించారు. ప్రాథమిక అలైన్మెంట్ను మాత్రమే విభేదించామని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ను, రీ ఇంజినీరింగ్ను తాము వ్యతిరేకించడం నిజమైతే విశ్రాంత ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం-తెలంగాణ జీవధార’ అనే పుస్తకాన్ని ఎందుకు తీసుకొస్తామని ప్రశ్నిస్తున్నారు.
ప్రాజెక్టు రీడిజైనింగ్, కరెంటు చార్జీలు, బరాజ్ నిర్మాణం తదితర అంశాలపై టీజేఏసీతోపాటు, అనేకమంది లేవనెత్తిన సాంకేతిక అంశాలపై ఆ పుస్తకంలో సంపూర్ణ వివరణలు ఇచ్చామని గుర్తుచేస్తున్నారు. ప్రాజెక్టును సమర్థించకుంటే తామెందుకు అలా చేస్తామని ప్రశ్నించారు. ప్రాజెక్టుపై బుదర జల్లే ప్రయత్నాలు మానుకుని, లోపాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విశ్రాంత ఇంజినీర్లు సూచించారు.
సంతకం పెట్టకపోవడానికి కారణం వేరే
మేడిగడ్డ బరాజ్కు సంబంధించి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపై విశ్రాంత ఇంజినీర్ శ్యాంప్రసాద్రెడ్డి సంతకం పెట్టలేదని సీఎం రేవంత్రెడ్డి ప్రస్తావించడం కూడా అసత్యమే. వాస్తవం ఏమిటంటే.. విశ్రాంత ఇంజినీర్ల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అది వారు స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్న కమిటీ. వారు స్వతంత్రంగా అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక అది. తేదీలు కూడా లేకుండా దానిని వారు బయటపెట్టారు.
ఆ నివేదికపై శ్యాంప్రసాద్రెడ్డి సంతకం పెట్టకపోవడానికి, మేడిగడ్డ బరాజ్ను వ్యతిరేకించడానికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయమై శ్యాంప్రసాద్రెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించింది. నివేదికపై అందరూ సంతకాలు పెట్టిన రోజున తాను హైదరాబాద్లో లేనని, కాబట్టే సంతకం పెట్టలేకపోయానని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యలను ఆయన ఖండించారు.