హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.45 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా పడుతుంది. అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణపై వేర్వేరుగా బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC) భేటీని నిర్వహిస్తారు. ఈ భేటీలో శాసనసభ, మండలి సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి..? ఏయే అంశాలను సభలో చర్చించాలి..? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.
సభలో ఈ నెల 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉభయసభలకు సెలవు ఉంటుంది. ఈ నెల 20న అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. 21న రంజాన్, 22న ఆదివారం సందర్భంగా ఉభయ సభలకు విరామం ఉంటుంది. 23 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాల్లో వివిధ శాఖల పద్దులపై చర్చిస్తారు.
జీహెచ్ఎంసీ చట్టసవరణ, వైద్యవిధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్పు చేస్తూ చట్టసవరణ, గిగ్ వర్కర్స్ సంక్షేమం.. తదితర బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవంపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు సమావేశాలు కొనసాగే అవకాశాలున్నాయి. ఇక అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఉదయం 11.27 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.