హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో ఓ గిరిజన మహిళపై దాడి ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి దాడి చేసిన కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, రామగుండం సీపీని ఆమె ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు మహిళా కమిషన్ అండగా ఉంటున్నదని భరోసా ఇచ్చారు. బాధితురాలికి ప్రభుత్వ పక్షాన న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు.