గుమ్మడిదల, ఆగస్టు 28 : ఇన్నాళ్లు నగరాల్లో జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే కనిపించే చైన్స్నాచింగ్ ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల వరకు చేరాయి. తా జాగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో పనిచేస్తున్న ఓ మహిళపై దాడి చేసి నాలుగు తులాల బం గారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన శనివా రం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మడిదల గ్రామానికి చెందిన పోచుగారి కవిత (30) ఎప్పటిలాగే కూరగాయలు తెంపుతున్నది. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమె పుస్తెలతాడు, చైన్ లాగేందుకు ప్రయత్నించగా కవిత ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఫెన్సింగ్ వైర్ చుట్టి కర్రతో తలపై బాదారు. తీవ్ర గాయాలై కవిత స్పృహ కోల్పోగా.. బం గారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గమనించిన సమీపంలోని రైతులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. బాధితురాలిని దవాఖానకు తరలించారు. చేన్లలో ఒంటరిగా పనిచేసే మహిళలు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.