ఆసిఫాబాద్ టౌన్, మే 3 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, కుమ్రంభీం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాను తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లాలో తిరగలేరని హెచ్చరించారు. జిల్లాల కుదింపు ఆలోచన మానుకోవాలని సూచించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కుమ్రంభీం ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, దాని నాణ్యత లోపానికి కాంగ్రెస్ సర్కారే బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు. కాలువలు పూర్తికాకముందే అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చేస్తారా? అని సీఎం రేవంత్ను ఆమె ప్రశ్నించారు.