మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దపల్లి టౌన్/ఎదులాపురం/నిర్మల్ టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. జీతాలు సక్రమంగా చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిర్మల్ తదితర కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందు ప్రధాన కూడళ్ల మీదుగా కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ తీశారు.
ఆయాచోట్ల ఆశ వర్కర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 2వ తేదీ నాటికి పారితోషికాలు ఆశ కార్యకర్తల ఖాతాల్లో జమ అయ్యేవని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా డబ్బులు జమ కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసి బతుకుతున్నామని వాపోయారు. పారితోషికం ఇవ్వకపోగా అభయహస్తం, మహాలక్ష్మీతోపాటు ఇతర పనులు తమతో కాంగ్రెస్ సర్కార్ చేయిస్తున్నదని మండిపడ్డారు. పీఆర్సీ వెంటనే చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ.5 లక్షలు చెల్లించాలని, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు మాపై మోయలేని భారం వేస్తున్నది. రెగ్యులర్ విధులతోపాటు గృహలక్ష్మి, అభయహస్తం అర్హుల వివరాల నమోదు బాధ్యతలు మాకే అప్పజెప్పింది. ఈ భారాన్ని మోయలేకపోతున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలి. హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. మా చదువుకు సాధ్యంకాని పనులు అప్పగించొద్దు.
– అణవేన స్వరూప, ఆశ కార్యకర్తల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు
ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఫిక్స్డ్ సాలరీగా రూ.26 వేలు చెల్లించాలి. సమయానికి జీతాలు అందక ఇల్లు కుటుంబ పోషణ భారంగా మారుతున్నది. పని భారం తగ్గించకపోతే సమ్మెలోకి వెళతాం.
– దాసరి విజయ, ఆశ కార్యకర్త, గొల్లపల్లి, పీహెచ్సీ సెంటర్.