వినాయక చవితి సమీపిస్తున్నది. పల్లెల్లో మళ్లీ మట్టి పరిమళాలు గుబాళిస్తున్నాయి. పర్యావరణానికి అంతులేని హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కంటే చూడముచ్చటైన మట్టి ప్రతిమల తయారీలో తెలంగాణ కుమ్మరులు నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక యంత్ర పరికరాలపై శిక్షణ పొందిన దాదాపు 4 వేల మంది వృత్తిదారులు బొజ్జ గణపయ్యలను ముస్తాబు చేస్తున్నారు. వీటికి మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శిక్షణ పొందిన కుమ్మరులు రాష్ట్రవ్యాప్తంగా మట్టి వినాయకుల తయారీలో నిమగ్నమయ్యారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల కంటే సొగసైన, చూడముచ్చటైన వినాయక ప్రతిమలను సిద్ధం చేస్తున్నారు.
వీరికి మూడేండ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇప్పించినప్పటికీ, కరోనా పరిస్థితుల కారణంగా వారి ప్రతిభ పెద్దగా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోవడం, పీవోపీ విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను పూజించేందుకు ప్రజలు మొగ్గు చూపుతుండటంతో శాలివాహనులు ఉత్సాహంగా వాటి తయారీ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం కుమ్మరి ఫెడరేషన్ పరిధిలో ఉన్న 2,076 కుమ్మరి/శాలివాహన సహకార సంఘాల్లోని దాదాపు 31వేల మంది సభ్యులకు కులవృత్తిలో ఆధునిక నైపుణ్యాలు, యంత్రపరికరాల వినియోగం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నది.
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా మట్టి టీ కప్లు, వాటర్ బాటిల్స్, గ్లాసులు, మగ్గులతో పాటు, మట్టి వినాయకుల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. రాష్ట్రంలో దాదాపు 350 మంది వృత్తిదారులు ఇప్పటికే మట్టి గణపతుల తయారీలో శిక్షణ పొందారు. వీరు మరికొందరికి శిక్షణ ఇవ్వడంతో మొత్తంగా దాదాపు నాలుగు వేల మంది సుశిక్షితులయ్యారు. ఇప్పుడు వీరంతా ఒక అడుగు, రెండు అడుగుల ప్రతిమలనే కాకుండా 5 అడుగుల ఎత్తయిన మట్టి గణపతులను సైతం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇండ్ల వద్దనే షెడ్లు నిర్మించుకొని, ప్రభుత్వం సమకూర్చిన అత్యాధునిక యంత్ర పరికరాల సహాయంతో విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ఒక్కొక్క కుటుంబం దాదాపు వంద విగ్రహాలను తయారు చేయాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నది. రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ర్టాలవారు ఇక్కడికి వచ్చి తయారుచేస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కంటే తెలంగాణ శాలివాహనులు రూపొందిస్తున్న మట్టి వినాయకుల ధర తక్కువగా ఉండటంతో ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
తమ పనితనం చూసిన చుట్టుపక్కలవారు భారీగానే ఆర్డర్లు ఇస్తున్నారని కుమ్మరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో 5 అడుగుల పీవోపీ విగ్రహానికి రూ.12 వేల వరకు డిమాండ్ చేస్తుండగా, మట్టి వినాయక ప్రతిమలు రూ.8 నుంచి 9 వేలకే లభిస్తుండటం విశేషం. బీసీ సంక్షేమశాఖ కూడా శాలివాహనులు తయారు చేస్తున్న మట్టి విగ్రహాలకు మార్కెటింగ్ కల్పించేందుకు కృషి చేస్తున్నది.
మట్టి విగ్రహాలను కొనుగోలు చేయడం ద్వారా శాలివాహనులను ప్రోత్సహించాలని ఇప్పటికే మున్సిపాలిటీలు, పలు ప్రభుత్వ శాఖలకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రత్యేకంగా లేఖలు రాశారు. ప్రభుత్వ నిర్ణయంతో నేడు పల్లెలన్నీ మళ్లీ మట్టి పరిమళాలతో గుబాళిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కుమ్మరులకు మట్టి వినాయకుల తయారీలో శిక్షణ ఇప్పించింది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. శిక్షణ పొందిన వృత్తిదారులు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మట్టి వినాయకుల తయారీ చేపట్టారు. చిన్న విగ్రహాలతోపాటు 5, 6 అడుగుల ఎత్తులో ఉండే వినాయక ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు. ప్రజలు వీటిని ప్రోత్సహిస్తే శాలివాహన వృత్తిదారులతోపాటు పర్యావరణానికీ మేలు జరుగుతుంది.
– నేదునూరి రాజు, శాలివాహన కులస్తుడు, శిక్షకుడు, వరంగల్
మాది మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపురం. మట్టి వినాయకుల తయారీపై కరోనా కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం మాకు శిక్షణ ఇప్పింది. మొదటి బ్యాచ్లో అన్నదమ్ములం శిక్షణ తీసుకున్నం. ఈ ఏడాది 100 విగ్రహాలు తయారుచేయాలనుకొన్నం. ఇప్పటివరకు 60 తయారు చేసినం. రూ.2 లక్షల పెట్టుబడితో ఇంటి వద్దనే షెడ్ ఏర్పాటు చేసినం. కుటుంబం మొత్తం పనిచేస్తున్నం. ఒక్కొక్క విగ్రహం తయారీకి మెటీరియల్, రంగులు కలుపుకొని రూ.ఐదువేల వరకు ఖర్చవుతున్నది. ఒక్కొక్కటి రూ.8,500కు అమ్ముతున్నం. చుట్టు పక్కల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉన్నది.
– ఏనుగంటి సత్యనారాయణ, జనార్దన్ అమ్మాపురం (మహబూబాబాద్)
మట్టి ప్రతిమల తయారీపై తెలంగాణ ప్రభుత్వం ద్వారా శిక్షణ పొందాం. ఈ ఏడాది పెద్ద ఎత్తున మట్టి వినాయక ప్రతిమలను తయారుచేస్తున్నాం. ఆర్డర్లు వస్తున్నాయి. చాలామంది అడ్వాన్స్లు ఇచ్చి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. కుమ్మర్ల జీవనోపాధికి ఎంతో భరోసా లభించింది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కొత్త తరం కూడా ఈ వృత్తిని చేపట్టేందుకు ముందువస్తున్నది.
– ఆశాడపు దేవేందర్, (ములుగు)