ఖమ్మం జిల్లా నేలపట్ల గ్రామానికి చెందిన ప్రవళ్లిక (22).. ప్రసవం కోసం ఈ నెల 1న అర్ధరాత్రి ఒంటి గంటకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. పురిటి నొప్పులు రాకపోవడంతో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశారు. వార్డుకు తరలించే క్రమంలో ఆమెకు ఫిట్స్ వచ్చాయి. అప్రమత్తమైన వైద్యులు చికిత్స అందించారు. అయినా రెండోసారి ఫిట్స్ రావడంతోపాటు స్పృహ కోల్పోయింది.
గుండె వేగం, రక్తపోటు నమోదు కాలేదు. దీంతో డాక్టర్ విమల, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ మానస బృందం మూడు దఫాలుగా సీపీఆర్ చేసి ఆ బాలింతకు పునర్జన్మను ప్రసాదించారు. దవాఖానలో కోలుకుంటున్న ఆమెను సోమవారం దవాఖాన వైద్యులు పరామర్శించారు. నేడో, రేపో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
– ఖమ్మం సిటీ