Paddy | హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగా ణ): సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సాగుచేస్తే మేలన్న అభిప్రాయం రై తుల్లో వ్యక్తమవుతున్నది. సన్నాలకు మద్దతు ధర లభించడంతోపాటు పొలం వద్దకే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17కు మించితే కొనుగోలు చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు మా త్రం 25-30 శాతం తేమ ఉన్నా అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ యాసంగిలో 30 శాతం తేమ ఉన్న సన్నధాన్యం క్వింటాలకు రూ.2400 పలికింది. మద్దతు ధర రూ. 2060కి మించి ధర పలకడంతో రైతులు సంతోషంలో మునిగిపోయారు. ఇప్పుడు వానకాలంలోనూ సన్నాలకు భారీ డిమాండ్ ఉంటుందని వ్యాపారులు, మిల్లర్లు చెబుతున్నారు.
సన్న ధాన్యం పండిస్తున్న రైతుల వద్దకే వస్తున్న మిల్లర్లు, వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జైశ్రీరాం, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా, బీపీటీ వంటి సన్నరకపు వరిని సాగు చేస్తున్న రైతులతో వ్యాపారులు ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా వ్యాపారులు, మిల్లర్లు వచ్చి రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
తేమ, తాలు శాతానికి పరిమితులు విధిస్తున్న కేంద్రం బియ్యం ధాన్యం కొనుగోలులో పలు నిబంధనలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీంతో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధల నుంచి బయటపడాలంటే సన్నాలు సాగుచేయడమే మంచిదన్న అభిప్రాయం రైతుల్లో నెలకొన్నది.