Summer | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వేడిమి కారణంగా ఉక్కపోత అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో చర్మ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉందని, చల్లని ప్రదేశాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. కలుషితమైన ఆహారం, నీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
ఎండలు బాగా ఉన్న సమయంలో కిడ్నీ, గుండె సంబంధిత రోగులు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని వైద్యులు సూచించారు. వీలైనంత వరకు తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవాలని చెప్పారు. సీనియర్ సిటిజెన్లు, షుగర్ వ్యాధిగ్రస్తులతో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరించారు.
-మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా చూసుకోవాలి.
-తెలుపు రంగు దుస్తులు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించేలా చూసుకోవాలి.
-బయటకు వెళ్తే.. మంచి నీళ్ల బాటిల్ను తీసుకెళ్లాలి.
-వీలైనంత వరకు శుద్ధమైన నీటిని తాగాలి.
-శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుకోవాలి.
-వడదెబ్బకు గురి కాకుండా.. చల్లని ప్రదేశాల్లో ఉండాలి.
-ఒక వేళ వడదెబ్బకు గురైతే.. ఆ వ్యక్తికి తక్షణమే ఓఆర్ఎస్ అందించాలి.
-వీలైనంత త్వరగా హాస్పిటల్కు తరలించేలా చర్యలు తీసుకోవాలి.
-క్యాప్, సన్ గ్లాసెస్ ధరించాలి.