హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిలో ఒకదానికి మంగళం పాడేందుకు ప్రయత్నిస్తున్నది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులకు ముందే మరో హామీకి తిలోదకాలిచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వరికి మద్దతు ధరపై క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని, కాబట్టి ఎవరూ తొందరపడి వడ్లు అమ్ముకోవద్దని ప్రచారంలో ఊదరగొట్టింది.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఇదే విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రచారసభల్లో సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు రేవంత్రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క కూడా ఇదే హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోనూ ఈ విషయాన్ని కాంగ్రెస్ స్పష్టంగా పేర్కొన్నది. వరికి ప్రస్తుతం రూ. 2,183 మద్దతు ధర ఉన్నదని, తాము అధికారంలోకి వస్తే దానికి రూ. 500 బోనస్ కలిపి రూ. 2,683 ఇస్తామని స్పష్టంగా పేర్కొన్నది. కాంగ్రెస్ హామీతో రైతులెవరూ వడ్లు అమ్ముకోలేదు.
ఇప్పుడేమో ఈ హామీకి తిలోదకాలివ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మాటలను బట్టి అర్థమవుతున్నది. గాంధీభవన్లో మంగళవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్పై నాలుక మడతేశారు. ప్రస్తుతం వరి మద్దతు ధర రూ. 2060 కాగా, బహిరంగ మార్కెట్లో రూ. 2,600 లభిస్తున్నదని, కాబట్టి రూ. 500 బోనస్ ఇవాల్సిన పనిలేదంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. కోదండరెడ్డి వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీ ప్రకారం బోనస్ చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మాటమార్చి హామీని అటకెక్కించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.