హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో మంగళవారం ఎంపీ అర్వింద్ను రైతులే అడ్డుకొన్నారని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే ఉద్దేశంతోనే ఎంపీని అడ్డుకొన్నారని, దీనికి టీఆర్ఎస్కు సంబంధంలేదని స్పష్టంచేశారు. మహిళలు అర్వింద్కు చెప్పులదండ వేసి ఊరేగించే రోజు దగ్గరలోనే ఉన్నదని అన్నారు. ప్రజాకోర్టులో ప్రజలే శిక్ష వేస్తారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో సమైఖ్యవాదులను ఉరికించినట్టుగా బంగారు తెలంగాణను అడ్డుకొంటున్న వారిని ఉరికిస్తున్నారని చెప్పారు. ఆర్మూర్లో తనపై అర్వింద్ పోటీచేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదని అన్నారు. తానే మూడోసారి 50 వేలకుపైగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేసిన ఎంపీ అర్వింద్ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లోనైనా మోదీ, అమిత్షా కాళ్లు పట్టుకొని పసుపు బోర్డు తీసుకురావాలని హితవు పలికారు. రైతులతో గోక్కున్నోడు ఎవ్వడూ బాగుపడలేదని అన్నారు. ‘హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లలో ఎందరో హీరోలు ఉండవచ్చు. ఒకే ఒక్కడు కేసీఆర్. తెలంగాణ ‘వార్’ హీరో. నాలుగున్నర కోట్ల తెలం గాణ ప్రజలు.. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లక్షల మంది ఆయన అభిమానులే. కేసీఆర్ను ఏమ న్నా అంటే వారంతా నిన్ను చెప్పులతో కొడతారు’ అని అర్వింద్ను హెచ్చరించారు. తనను నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.