ఆర్మూర్/మల్లాపూర్, మే 14: రాజ్యాంగాన్ని మారుస్తామని వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఆలిండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మూగ ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై ముట్టుడు స్నానాలు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అధికార, అంగబలం, అహంతో రాజ్యాంగాన్ని మారుస్తాం.. సెక్యులర్ పదమే ఉండనీయం అంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యాంగం జోలికొస్తే తాట తీస్తాం.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో అంబేద్కర్ సంఘం నాయకులు ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాధ్యత గల ఎంపీ హోదాలో ఉండి రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.