బేగంపేట, ఫిబ్రవరి 6: యుక్త వయస్సులో జన్యుపరమైన కారణాల వల్ల ఒక వృషణం కోల్పోయిన యువకుడికి కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా కృత్రిమ వృషణాన్ని అమర్చారు. 23 ఏండ్ల ఆ యువకుడికి నాలుగేండ్ల క్రితం ఒక వృషణం మెలి తిరగటంవల్ల రక్తప్రసరణ ఆగిపోయి మృతస్థితికి చేరింది. దానిని తొలగించకపోతే రెండోది కూడా చెడిపోతుందని వైద్యులు చెప్పటంతో కిమ్స్లో చేరాడు. అతడి పరిస్థితిని గమనించిన వైద్యులు, శస్త్రచికిత్స ద్వారా మృత వృషణాన్ని తొలగించి సిలికాన్తో తయారు చేసిన కృత్రిమ వృషణాన్ని అమర్చారు. అది సాధారణ వృషణం చేసే పనులేమీ చేయదు. పైకి మాత్రం రెండు వృషణాలు ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో రోగి మానసికంగ ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించే అవకాశం ఉంటుంది. భవిష్యత్లో అతడికి వైవాహిక జీవితానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని కిమ్స్ కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ ఉపేంద్రకుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. అదృష్టశావత్తు రెండో వృషణం దెబ్బతినక ముందే అతడు వైద్యంకోసం రావడంతో వీర్య కణాల ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. కృత్రిమ వృషణం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని తెలిపారు.