యాదాద్రి, నవంబర్ 11: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకప్పుడు నూతన సంవత్సర వేడుకల సమయంలోనే కనిపించే విదేశీ భక్తులు.. నూతన ఆలయ పునఃప్రారంభం తర్వాత వారానికి రెండు, మూడు సార్లు కొండపై కనిపిస్తున్నారు. శుక్రవారం జర్మన్కు చెందిన నలుగురు మహిళలు స్వామివారిని దర్శించుకుని ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉందని కితాబిచ్చారు. అమెరికాతోపాటు యూఏఈ, ఆస్ట్రేలియా, జర్మన్, న్యూజిలాండ్, యూరప్, కెనడా, ఖతార్, సింగపూర్, స్కాట్లాండ్కు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకొంటున్నారు. పూర్తి కృష్ణ శిలలతో నిర్మితమైన స్వామివారి ఆలయం దేశంలో గొప్ప దేవాలయంగా పేరొందుతుందని అభిప్రాయపడుతున్నారు. మీడియా ప్రసారాలతో పాటు ప్రవాస భారతీయ భక్తుల రాక, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంతో ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి విదేశీ భక్తులు పెరిగారు. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి ఈ నెల 10 వరకు అధికంగా 678 అమెరికా డాలర్లు, 230 యూఏఈ దిరామ్స్తో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ భారీగా స్వామివారి ఖజానాకు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.