హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని, కల్తీ విత్తనాలపై ఉకుపాదం మోపాలని సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాల లభ్యత, ఎరువులు, పురుగుల మందుల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలనపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులపై దాడులుచేయాలి. కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలి. ఎంతటివారినైనా పీడీ యాక్టు కింద అరెస్టుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకొన్న వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీలతోపాటు ప్రభుత్వం సేవాపతకం అందజేస్తుంది. ఈ మేరకు డీజీపీ తక్షణమే జిల్లాలవారీగా పోలీసులను రంగంలోకి దించాలి. నిఘావర్గాలు కల్తీ విత్తన తయారీదారుల ముఠాలను కనిపెట్టాలి. ఇగ మీరు నర్సింహావతారం ఎత్తాలె. దొరికినోన్ని దొరికినట్టే పట్టుకొని పీడీయాక్టు పెట్టాలె. తెలంగాణల కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేటట్టు మీ చర్యలుండాలె. కల్తీ విత్తనాలపై యుద్ధం ప్రకటించాలె’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
‘సన్న చిన్నకారు రైతు ఒకటి రెండు ఎకరాలమీద ఆధారపడి కుటుంబాన్ని సాదుకుంటాడు. అటువంటి రైతును కల్తీ విత్తనాలతో మోసంచేయడమంటే దుర్మార్గపు చర్య. కల్తీ విత్తనాలు కొని నాటేస్తే రైతు అన్ని తీర్లా నష్టపోతడు. విత్తనం నాటి పంటను పెంచుకొని తీరా కాతకాసే ముందు నిలబడిపోతే ఊహించని పరిణామానికి గుండె పలిగి హతాశులైపోతారు. ఇందుకు కారణమయ్యే కల్తీ విత్తనదారులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. విత్తనాలనే కాకుండా ఫెర్టిలైజర్లు కూడా కల్తీ కావడం దుర్మార్గం. బయో ఫెస్టిసైడ్స్ పేరుతో రైతులను మోసం చేసే ముఠాలను కూడా పట్టుకొని పీడీ యాక్టు పెట్టాలె. కల్తీ విత్తనాల తయారీపై జిల్లా అధికారులు అప్రమత్తం కావాలి. అధికారులే అవినీతికి పాల్పడుతూ, కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు రుజువైతే వారిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా 5 దేండ్లు జైలు శిక్ష పడేలా చూడాలి. వ్యవసాయఅధికారులు అలసత్వం వీడాలి. కల్తీలను పసిగట్టి నియంత్రించాలి. దీనికి జిల్లా వ్యవసాయాధికారి అసిస్టెంట్ డైరెక్టర్లు బాధ్యత వహించాలి. వారి వారి జిల్లాల్లో పర్యటించాలి. కల్తీకి అలవాటు పడిన ముఠాలను గుర్తించి పీడీ యాక్టు బుక్చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు సమీక్షలు నిర్వహించాలి.’
‘ఇప్పటికే రోహిణి కార్తె వచ్చింది. మరో వారంరోజుల్లో రుతుపవనాలు కూడా వస్తున్నాయి. రైతులు సాగుకుసిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలి. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లుచేసుకోవాలి. పత్తి, కంది, వరిధాన్యం విత్తనాలను సేకరించి రైతులకు అందించాలి. అదే సమయంలో కావాల్సినంత ఎరువులు, పెస్టిసైడ్స్ను సిద్ధం చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
‘కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటిసారిగా తెలంగాణలో క్యూఆర్ కోడ్తో ‘సీడ్ ట్రేసబిలిటీ’ని వ్యవసాయశాఖ మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అమలుచేయాలి. ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలే విత్తన విక్రయాలు చేపట్టేలా ఈ నియంత్రణ చర్యలుండాలి. క్యూఆర్ కోడ్తో కూడిన ప్రభుత్వ సర్టిఫైడ్ ముద్ర విత్తనాల ప్యాకెట్ల మీద ఉంటున్నాయి. స్మార్ట్ఫోన్తో సాన్ చేయడం ద్వారా విత్తన కంపెనీల పూర్తి వివరాలుంటాయి. ఆలస్యంచేయకుండా తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తేవాలి.’